మెదక్,జూలై,17(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)
మెదక్ పట్టణ అభివృద్ధికి అత్యంత కీలకమైన నూతన మాస్టర్ ప్లాన్ను తక్షణమే అమలు చేయాలని మెదక్ పట్టణ టీఆర్ఎస్ కన్వీనర్, 5వ వార్డు కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు దాదాపు 40 సంవత్సరాల క్రితం రూపొందించిన పాత మాస్టర్ ప్లాన్ల స్థానంలో నూతన మాస్టర్ ప్లాన్లు రూపొందించే ప్రక్రియలో భాగంగా, గత పాలకవర్గం మెదక్ పట్టణానికి సంబంధించిన సమగ్ర సర్వేలను పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా, నూతన మాస్టర్ ప్లాన్ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మెదక్ పట్టణ అభివృద్ధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ లేకపోవడంతో కొత్త భవనాలకు నిర్మాణ అనుమతులు జారీ కావడం లేదని, దీంతో ప్రజలు అక్రమ నిర్మాణాల వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఫలితంగా మున్సిపాలిటీకి రావాల్సిన నిర్మాణ అనుమతి ఫీజులు, ఆస్తి పన్నులు వంటి ఆదాయం కోల్పోయి ఆర్థికంగా నష్టపోతోందని పేర్కొన్నారు.ఇప్పటికే మాస్టర్ ప్లాన్ పరిధిలో నిర్మించిన భవనాలకు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ( బీఆర్ఎస్) ద్వారా పూర్తి స్థాయి అనుమతులు కల్పించాలని, అలాగే మెదక్ పట్టణ నూతన మాస్టర్ ప్లాన్ను వెంటనే ఆమోదించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని జిల్లా కలెక్టర్తో సమన్వయం చేసి మెదక్ పట్టణ నూతన మాస్టర్ ప్లాన్కు త్వరితగతిన ఆమోదం వచ్చేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మెదక్ పట్టణ భవిష్యత్ అభివృద్ధి దృష్ట్యా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.మామిళ్ల ఆంజనేయులుమెదక్ పట్టణ బిఆర్ఎస్ కన్వీనర్5వ వార్డు కౌన్సిలర్