మెదక్ డిసెంబర్ 29 మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి) మెదక్ జిల్లా పరిధిలో చైనా మంజా పూర్తిగా నిషేధం,సంక్రాంతి నేపథ్యంలో చైనా మంజాపై ప్రత్యేక తనిఖీలు,నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినా, వినియోగించినా కఠిన చట్టపరమైన చర్యలు,జిల్లా ఎస్ పి శ్రీనివాస రావు.మెదక్ జిల్లా పరిధిలో చైనా మంజాను పూర్తిగా నిషేధించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం చైనా మంజాపై నిషేధం విధించిన నేపథ్యంలో, నిబంధనలకు విరుద్ధంగా చైనా మంజాను విక్రయించినా, వినియోగించినా లేదా దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవించినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేస్తారని తెలిపారు. నైలాన్, సింథటిక్ దారాలతో తయారయ్యే చైనా మంజా పర్యావరణానికి తీవ్ర హాని కలిగించడంతో పాటు, సాధారణ ప్రజలు, వాహనదారులు మరియు పక్షులకు ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.చైనా మంజాతో గాలిపటాలు ఎగురవేసే సమయంలో గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, గాలిపటాలు ఎగురవేసే వ్యక్తులు సైతం తీవ్రంగా గాయపడిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. ఈ కారణాల వల్లనే చైనా మంజాపై పూర్తిస్థాయి నిషేధం విధించబడిందని జిల్లా ఎస్పీ వివరించారు.చైనా మంజా విక్రయాలు, వినియోగంపై పర్యావరణ పరిరక్షణ చట్టం – 1986 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలో ఎక్కడా చైనా మంజా విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజలు చైనా మంజాను ఉపయోగించకుండా, ఎవరికీ హాని కలగని సాధారణ దారాలతో గాలిపటాలు ఎగురవేయాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా చైనా మంజా విక్రయిస్తున్నట్లు లేదా వినియోగిస్తున్నట్లు గమనించినట్లయితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.