MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 12 November 2025, 8:23 am Digital Edition : Medak Today

పూతన పేరు వినగానే చిన్ని కృష్ణునికి విషపు పాలిచ్చి, అతని చేతిలో చనిపోయిన రాక్షస స్త్రీ అని అందరికీ గుర్తు వచ్చేస్తుంది.

(స్టేట్ బ్యూరో)నవంబర్,12,మెదక్ టుడే న్యూస్:

పూతన…..

పూతన పేరు వినగానే చిన్ని కృష్ణునికి విషపు పాలిచ్చి, అతని చేతిలో చనిపోయిన రాక్షస స్త్రీ అని అందరికీ గుర్తు వచ్చేస్తుంది. చిన్ని కృష్ణుని చేతిలో చనిపోయినవారిలో పూతనకు ఒక ప్రత్యేకత ఉంది. రాజైన కంసుని ఆజ్ఞ దాటలేక ఆమె ఎంతోమంది శిశువులను చంపింది. తన బిడ్డను తనే స్వయంగా చంపుకుంది. కంసుడు చివరగా నంద కుమారుడైన కృష్ణుని చంపమన్నాడు. స్త్రీలందరూ తనను చూసి భయపడుతున్నారని, శిశుహంతకి అని నిందిస్తున్నారని, ప్రతి శిశువులో తన బిడ్డ దీనాలాపాలు వినిపిస్తున్నాయని ఇంక తానీ దారుణం చేయలేనని ఆమె కంసుని వేడుకుంటుంది. కంసుడు తన ఆజ్ఞ పాటించకపోతే ఆమెనే చంపేస్తానంటాడు.దేవకీ దేవి అష్టమ గర్భాన పుట్టే శిశువు తన మరణానికి కారకుడవుతాడన్న ఆకాశవాణి పలుకులు విని కంసుడికి భయం పట్టుకుంటుంది. దేవకీ వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. వారికి పుట్టిన ఆరుగురు శిశువులను చంపిస్తాడు. కృష్ణుడికి అగ్రజుడుగా పుట్టవలసిన ఏడవ శిశువు దేవకి గర్భంలో పెరుగుతుండగా యోగ మాయ రోహిణి గర్భంలో ప్రవేశపెడుతుంది. అతడే బలరాముడు.శ్రీకృష్ణ జననం కారాగారంలో కన్నులపండుగగా జరుగుతుంది. విష్ణుమాయతో ద్వారపాలకులంతా గాఢనిద్రలో ఉండగా, వసుదేవుడు చిన్ని కృష్ణుని తట్టలో పెట్టుకుని, యమునా నది దాటి, గోకులానికి వెళ్లి నందుడికి అప్పగిస్తాడు. బదులుగా పసిపాప ఉన్న తట్టను తీసుకువచ్చి దేవకి పక్కన పడుకోబెడతాడు. ఆమె యోగమాయ. యోగమాయ కంసుని చంపే మృత్యువు వేరే చోట పెరుగుతున్నాడని హెచ్చరిస్తుంది. దాంతో ఆ సమయంలో పుట్టిన శిశువులందరినీ కంసుడు చంపిస్తాడు. కంసుని ఆజ్ఞతో పూతన అందమైన స్త్రీ రూపంలో గోకులానికి మహా దేవుని పూజకని చెప్పివస్తుంది. స్త్రీలంతా ఆమెను సాదరంగా ఆహ్వానిస్తారు. చిన్ని కృష్ణుని లాలించి, ముద్దాడి పాలు ఇస్తున్నట్లుగా, విషపు పాలు ఇస్తుంది. చిన్ని కృష్ణుడు పాలతోపాటు ఆమె ప్రాణాలు పీల్చివేస్తాడు. పూతన నిజరూపంతో నేలకూలుతుంది. పూతన గత జన్మలో బలి చక్రవర్తి కూతురు రత్నమాల. శ్రీహరి వామన రూపంలో బలి దగ్గరకు వచ్చినప్పుడు రత్నమాల అతని ముగ్ధమనోహర రూపం చూసి ఈ అమృత మూర్తికి పాలిచ్చే భాగ్యం లేకపోయిందే అని బాధపడిందట. హరి ఆమె మనసు గ్రహించి, ద్వాపర యుగంలో పూతనగా జన్మించిన ఆమెవద్ద పాలు తాగి ఆమె కోరిక తీర్చాడు. తాగింది విషమైనా, తనకు పాలిచ్చిన తల్లిగా భావించి ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు. తనకు విషాన్నిచ్చిన వారికి అమృతత్వాన్ని ప్రసాదించిన కరుణామూర్తి శ్రీకృష్ణ పరమాత్మ! ఆ దివ్యమూర్తి కరుణను పొందిన ధన్యజీవి పూతన.