ఆక్రమణలపై జిహెచ్ఎంసి అధికారుల ఉక్కుపాదం – నరే గూడెం నుండి కిష్టారెడ్డిపేట వరకు స్పెషల్ డ్రైవ్
అమీన్పూర్ జనవరి 31:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలో ప్రధాన రహదారుల వెంట అక్రమంగా వెలిసిన షెడ్లు, తడకల తొలగింపునకు అధికారులు భారీ ఎత్తున చర్యలు చేపట్టారు. నరేగూడెం నుండి కిష్టారెడ్డిపేట వెళ్లే ప్రధాన రహదారిపై ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న ఆక్రమణలపై జిహెచ్ఎంసి అధికారులు శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఇటీవల ‘మెదక్ టుడే’ పత్రికలో రహదారి ఆక్రమణలు మరియు అపరిశుభ్రతపై వచ్చిన ప్రత్యేక కథనానికి జిహెచ్ఎంసి అధికారులు తక్షణమే స్పందించారు. పత్రికా కథనంతో అప్రమత్తమైన అధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే మెయిన్ రోడ్డు వెంబడి ఉన్న చెట్ల పొదలను, అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించి శుభ్రపరిచే పనులు చేపట్టారు.జిహెచ్ఎంసి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సిబ్బంది జెసిబి యంత్రాలతో రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించారు.ఆక్రమణల తొలగింపు: రహదారిని ఆక్రమిస్తూ ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా నిర్మించిన తాత్కాలిక షెడ్లను, కర్రలతో వేసిన తడకలను పూర్తిగా తొలగించారు.పెద్ద చెట్ల తొలగింపునకు నోటీసులు: రోడ్డు విస్తరణకు మరియు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న పెద్ద ఎత్తున ఉన్న చెట్లను గుర్తించిన అధికారులు, వాటిని తొలగించేందుకు ఇప్పటికే సంబంధిత వారికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. అతి త్వరలోనే ఆ చెట్లను కూడా తొలగించి రహదారిని క్లియర్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.రహదారులు వెడల్పుగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా రహదారిని ఆక్రమించిన వ్యాపారులు మరియు వ్యక్తులపై అధికారులు కొరడా ఝుళిపించారు. అధికారుల బృందం జెసిబిలతో క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేస్తోంది.ప్రజల సమస్యలపై స్పందిస్తూ కథనాన్ని ప్రచురించిన ‘మెదక్ టుడే’ పత్రికను మరియు తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్న జిహెచ్ఎంసి అధికారులను స్థానికులు అభినందిస్తున్నారు.

