(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్ నగర్,మే,1, మెదక్ న్యూస్:ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మే డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ సంఘ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ శ్రామిక ప్రజానికానికి 140వ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని అన్నారు. యాజమాన్యాలకు అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలను అన్ని కార్మిక సంఘాలు కలసికట్టుగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
మే డే స్ఫూర్తితో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు. సంఘాల పేరుతో స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేసే వారి పట్ల కార్మిక వర్గం అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాఘవేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, కుమార్, శ్రీనివాస్, రమేష్ నాయక్, ఆంజనేయులు, నరసింలు, చంద్రాయుడు, లింగం, రవి, సత్యం తదితరులు పాల్గొన్నారు.
