చేగుంట,ఏప్రిల్,22,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గల మాసాయిపేట మండలం, మాసాయిపేట గ్రామంలో కల్లు దుకాణం వద్ద జరిగిన గొడవలో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులను చేగుంట పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 20న రాత్రి మాసాయిపేటలోని కల్లు దుకాణం వద్ద వడ్డెర నగేష్ అనే వ్యక్తి బాటిళ్లు పగలగొడుతుండగా, అదే గ్రామానికి చెందిన గుడ్డి దశరథ్ (49) వారించాడు. దీంతో ఆగ్రహానికి గురైన వడ్డెర శ్రీకాంత్, నగేష్, దుర్గా స్వామి, సందీప్లు కలిసి దశరథ్పై తీవ్రంగా దాడి చేశారు. ఈ క్రమంలో నిందితుడు శ్రీకాంత్ బండరాయితో దశరథ్ తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే దశరథ్ మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
మృతుని తమ్ముడు సిద్ధిరమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, డీఎస్పీ నేతృత్వంలో విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రజలు క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, కల్లు దుకాణాల వద్ద తప్పనిసరిగా సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ విచారణలో చేగుంట ఎస్ఐ చైతన్య రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.