
అమీన్ పూర్,ఫిబ్రవరి,19,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ సాయి కాలనీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. మాజీ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బోయిని బాలమణి బాలరాజ్ మాట్లాడుతూ.భారతీయ ధర్మ రక్షణ కోసం, స్వరాజ్య స్థాపన కోసం పోరాడిన వీర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన ధైర్యసాహసాలు, పరిపాలనా దక్షత నేటి యువతకు గొప్ప స్ఫూర్తిదాయకం. దేశం కోసం శివాజీ పడ్డ తపనను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి” అని పిలుపునిచ్చారు. యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు.అనంతరం బీరంగూడలో సుమారు 200 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీతో బీరంగూడ ప్రాంతమంతా కాషాయమయంగా మారింది. “జై శ్రీరామ్.. జై ఛత్రపతి శివాజీ మహారాజ్” అంటూ యువకులు చేసిన నినాదాలతో ప్రాంతం మొత్తం మారుమోగింది. యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ జయంతి వేడుకలను దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు మరియు భారీ సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.
