(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్నగర్,ఏప్రిల్,13,మెదక్ టుడే న్యూస్:
షాద్నగర్ మున్సిపాలిటీలో కోఆప్షన్ పదవుల కోసం పోటీ రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతున్న నేపథ్యంలో, మాజీ కౌన్సిలర్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తనకే ఆ అవకాశం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కోఆప్షన్ పదవి విషయంలో గతంలో పార్టీ అధిష్టానం తనకు రాజకీయంగా సముచిత న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఆ హామీని ఈసారి తప్పకుండా నిలబెట్టుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.ముఖ్యంగా, మున్సిపాలిటీలో ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేకపోవడం తనకు అనుకూలంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆ కోటాలో తనకే అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.గత మున్సిపల్ ఎన్నికల్లో 24వ, 25వ వార్డులతో పాటు 5వ, 6వ వార్డుల్లో పార్టీ విజయానికి తన వంతు కృషి చేశానని విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా 6వ వార్డులో తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో కిరణ్ను రాజీ దిశగా తీసుకెళ్లి పార్టీకి అనుకూల వాతావరణం కల్పించానని వివరించారు.అలాగే, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన నివాసంలో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి సహా పలువురు స్థానిక నాయకులు తన సేవలను గుర్తించి భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
పార్టీలో నిబద్ధతతో, నిజాయితీతో పనిచేస్తూ ఎంతోకాలంగా గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నానని, ఈసారి కోఆప్షన్ పదవి ద్వారా తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.