15 రోజులకు ఒక లారీ వస్తే రైతులు ఏమైపోవాలి?: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హరీష్ రావు.

చేగుంట,మే,10,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం కర్నాల్పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం మాజీ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్న హరీష్ రావు, ప్రస్తుత ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్నాల్పల్లి కేంద్రం ప్రారంభించి 25 రోజులు గడిచినా కేవలం రెండు లారీలు మాత్రమే రావడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయిందని, రైతులు కష్టపడి మళ్ళీ ఎండబెట్టినా కొనే నాథుడే లేడని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించలేదని, మంత్రులు జిల్లాల వైపు చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం నిరంతరం శ్రమించామని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులే కలెక్టరేట్ ముందు ధర్నాలు చేసే దుస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల కళ్ళలో కన్నీళ్లు కనిపిస్తున్నా ప్రభుత్వం ఢిల్లీ పర్యటనలు, రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని, తక్షణమే ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.