(స్టేట్ బ్యూరో)హైదరాబాద్,నవంబర్,29, మెదక్ టుడే న్యూస్:
తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమం తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, తమ హక్కుల సాధన కోసం పోరుబాటే ఏకైక మార్గమైపోయిందని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి అశోక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం సమాచార శాఖ కార్యాలయం వద్ద జరగనున్న మహాధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ,ఉమ్మడి రాష్ట్రంలో అమలైన జర్నలిస్టుల సంక్షేమ పథకాలు తెలంగాణలో పూర్తిగా గల్లంతయ్యాయని, ప్రభుత్వాల నిర్లక్ష్యం మరింత పెరిగిందని మండిపడ్డారు.జర్నలిస్టుల కోసం అత్యవసరమైన ఆరోగ్య భద్రత, అక్రిడిటేషన్, సంక్షేమ నిధి, రక్షణ కమిటీలు నిలిచిపోయి సంవత్సరాలు గడిచినా, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదని వారు విమర్శించారు. ముఖ్యంగా చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న అప్గ్రేడేషన్ సమస్యలు, 16 నెలలుగా ప్రకటన బిల్లుల విడుదలలో జాప్యం పై ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు కూడా ఇంతవరకు అమలుకాలేదని, దీనివల్ల వేలాది మంది జర్నలిస్టులు నిరాశలో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3న మాసాబ్ట్యాంక్లోని సమాచార శాఖ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న పత్రికల సంపాదకులు, జర్నలిస్టులు భారీ ఎత్తున ధర్నాలో పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లను వినిపించాలని పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హితవు పలికారు.టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరహత్ అలీ పిలుపు మేరకు, అనుబంధ సంఘమైన చిన్న మధ్యతరగతి పత్రికల సంఘం కూడా ఈ మహాధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. చిన్న పత్రికల సమస్యల పరిష్కారానికి ఈ మహాధర్నానే పెద్ద వేదిక కానుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐజెయూ సభ్యులు మాతంగి దాస్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర కోశాధికారి అజాం ఖాన్, రాష్ట్ర నాయకులు ఇక్బాల్, ఉస్మాన్ రషీద్, బాలకృష్ణ, అహ్మద్ అలీ, మురళి, వెంకటయ్య, అఫ్రోజ్, అమాన్, మోసిన్ అలీ, గౌస్, రియాసత్, ఇలియాజ్, అంజాద్, అన్వార్, శ్రీనివాస్, జాన్ షహీద్, ఖాసీం, ప్రకాష్, అసద్తో పాటు ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు పత్రికల సంపాదకులు పాల్గొన్నారు.
