MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 3:29 am Digital Edition : Medak Today

గుమ్మడిదలలో వైభవంగా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు: అశ్వవాహనంపై ఊరేగిన స్వామివారు.

గుమ్మడిదల,మార్చి,10,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల పురపాలక సంఘం పరిధిలోని బొంతపల్లి గ్రామంలో వెలసిన భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారు విశేషంగా అలంకరించిన అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

భక్తిశ్రద్ధలతో వాహన సేవ:

ఆలయ ప్రాంగణంలో శివనామ స్మరణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారికి హారతులు సమర్పించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి “హర హర మహాదేవ”, “వీరభద్ర స్వామికి జై” అంటూ చేసిన నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.

కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం:

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రతిరోజూ స్వామివారిని విభిన్న వాహనాలపై అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తుండటంతో, స్థానిక గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి పోయింది.

పాల్గొన్న ప్రముఖులు:

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి, ధర్మకర్తలు అశోక్, భాస్కర్ గౌడ్, ఆలయ సిబ్బంది సోమయ్యతో పాటు స్థానిక నాయకులు ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, హుస్సేన్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిభావంతో సాగేలా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.