•ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి.
మెదక్,డిసెంబర్,1,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి
గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు ప్రతి ఓటరు, ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఎన్నికల నిబంధనలు పాటించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.మెదక్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,గ్రామాల్లో గొడవలు, గుంపుల తగాదాలు, ఉద్రిక్తతలకు దారితీసే చర్యలు పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థులు, పార్టీ చిహ్నాలపై వాదనలు, ప్రేరేపించే వ్యాఖ్యలు చేయరాదని తెలిపారు. ఎవరినైనా బెదిరించి ఓటు వేయమని ఒత్తిడి చేయడం నేరమని, డబ్బు, మద్యం, ఉచితాలు ఇచ్చి ఓటర్లను ప్రభావితం చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఎన్నికల సమయంలో మద్యం నిల్వ, పంపిణీ, వినియోగం కనిపిస్తే వెంటనే కేసులు నమోదు చేయబడుతాయని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రాణహాని కలిగించే ఆయుధాలు తీసుకురావడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అనుమతి లేకుండా లౌడ్స్పీకర్ల వినియోగం, గోడలపై పోస్టర్లు అతికించడం, ప్రభుత్వ లేదా ప్రజల ఆస్తుల ధ్వంసం చేయడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.పోలింగ్ రోజు ఓటర్లు క్యూలో ప్రశాంతంగా నిలబడి ఓటు వేయాలని, పోలింగ్ బూత్లో మొబైల్ ఫోన్లు తీసుకురావడం పూర్తిగా నిషేధమని తెలిపారు. సోషల్ మీడియాలో పుకార్లు, నకిలీ వార్తలు షేర్ చేయడం ప్రమాదకరమని వారి నిఘా ఉంటుందని అన్నారు. ఏవైనా అక్రమ కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.మీ ఓటు మీ హక్కు, స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.