MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 5:12 am Digital Edition : Medak Today

గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలి: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు,

మెదక్. హవేలి ఘనపూర్ మండలం డిసెంబర్ 1 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి

గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రతి ఓటరు, ప్రతి గ్రామస్థుడు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, తెలిపారు. హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజిరెడ్డిపల్లి, గాజిరెడ్డిపల్లి తండా, బూర్గుపల్లి, గ్రామలకు చెందిన ప్రజలకు ఈ రోజు నిర్వహించిన ఎన్నికల అవగాహన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, గ్రూపు దాడులు, అల్లర్లు, అనవసర ర్యాలీలు జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని, గత ఎన్నికల మాదిరిగా ఉల్లంఘనలకు పాల్పడినవారిని బైండోవర్ చేసే ప్రక్రియను కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ పూర్తిగా నిషేధం అని స్పష్టం చేశారు.ప్రతి ఓటరు తన ఇష్టమైన అభ్యర్థికి ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఓటర్లను బెదిరించడం, ప్రలోభపెట్టడం, బలవంతం చేయడం నేరమని చెప్పారు. ప్రచారం సంబంధిత అధికారుల అనుమతి తీసుకొని మాత్రమే నిర్వహించాలని, స్పీకర్లు, మైకులు, పోస్టర్లు, ర్యాలీలు అన్నీ అనుమతి తీసుకొని నిర్వహించాల్సిందిగా సూచించారు.పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ ఫోన్లు, పార్టీ చిహ్నాలు, తీసుకురావడం నిషేధం. ఓటర్లు శాంతియుతంగా క్యూలో నిలబడి ఓటు వేయాలని, ఓటర్ ఐడి లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని చెప్పారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించేవారి గురించి లేదా అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులను సమాచారం ఇవ్వాలని కోరారు. ఎన్నికల ఫలితాల అనంతరం జరుపుకునే సంబరాలు, బాణసంచా, ర్యాలీలు పోలీసుల అనుమతి లేకుండా నిర్వహించరాదని తెలిపారు.ప్రజలందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించి, ఎన్నికలను పూర్తిగా ప్రశాంతంగా నిర్వహించేలా ముందుకురావాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ మెదక్ రూలర్ సిఐ జార్జ్ ఎస్సై నరేష్ సంబంధిత అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.