మెదక్,ఏప్రిల్,26,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,ఆదివారం ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో, ప్రతి ఆదివారం ప్రత్యేకంగా క్విక్ రెస్పాన్స్ టీమ్ ( క్యూ ఆర్ టి) సిబ్బందితో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయబడుతోంది. ఈ క్రమంలో ఓ తల్లి షాపులో కొనుగోళ్లు చేస్తున్న సమయంలో, ఆమెతో ఉన్న చిన్నారిని ఓ దుండగుడు ప్రక్కకు తీసుకెళ్లి, చిన్నారి కాళ్లలో ఉన్న వెండి కడియాలను అపహరించి తన లోదుస్తుల్లో దాచుకున్నాడు.విధుల్లో అప్రమత్తంగా ఉన్న క్యూ ఆర్ టి సిబ్బంది ఈ ఘటనను గమనించి, వెంటనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రారంభంలో తనకు ఏమీ తెలియదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసులు అతనిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, చిన్నారి వద్ద నుంచి అపహరించిన రెండు వెండి కడియాలు అతని వద్ద లభించాయి.పోలీసులు వెంటనే ఆ వెండి కడియాలను చిన్నారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన భక్తులు, పోలీస్ సిబ్బంది చూపిన అప్రమత్తత, సమయస్ఫూర్తిని అభినందించారు.
అనంతరం నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పాపన్నపేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. జాతరలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.