మెదక్,మార్చ్,26,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మెదక్ జిల్లా ఎస్పీ డి. వి.శ్రీనివాస రావు ఐపీఎస్.మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జయంతి కార్యక్రమాల్లో భాగంగా మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలను స్మరించుకున్నారు.ఈసందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ మాట్లాడుతూ, దుద్దిళ్ల శ్రీపాదరావు సౌమ్య స్వభావం, సరళ జీవనశైలి కలిగిన నాయకుడిగా ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యులై ప్రజానాయకునిగా గుర్తింపు పొందారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన రాజకీయ జీవితాన్ని కొనసాగించారని పేర్కొన్నారు.అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన కాలంలో ఆయన చూపిన నిజాయితీ, నిరాడంబరత, నిష్పక్షపాత నిర్ణయాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు బలాన్ని చేకూర్చాయని అన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.ప్రజాసేవే ధ్యేయంగా సాగిన దుద్దిళ్ల శ్రీపాదరావు జీవితం నేటి యువతకు, రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ తెలిపారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, ఆర్ఐ లు శైలందర్, రామ కృష్ణ, సీఐ లు సందీప్ రెడ్డి, కృష్ణ మూర్తి, ఎసై లు సిబ్బంది పాల్గొన్నారు.
