MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 2:10 am Digital Edition : Medak Today

దత్తత అవగాహన కార్యక్రమంలో ఎంపీడీవో బన్సీలాల్.

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,ఏప్రిల్,30,మెదక్ టుడే న్యూస్:
ఫరూక్‌నగర్ మండల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం దత్తతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో బన్సీలాల్ హాజరయ్యారు. సీడీపీఓ ఉదయ మేడం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్లు విజయ, సంధ్యలు చట్టబద్ధ దత్తత ప్రక్రియ, అనధికార దత్తత వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. దత్తత తీసుకునే దంపతులు కనీసం రెండు సంవత్సరాలు కలిసి ఉండాలని, వారి వయస్సు పిల్లల వయస్సుకంటే కనీసం 25 సంవత్సరాలు ఎక్కువగా ఉండాలని తెలిపారు. ఒంటరి మహిళ ఏ వయస్సు పిల్లనైనా దత్తత తీసుకోవచ్చని, అయితే ఒంటరి పురుషుడు ఆడపిల్లను దత్తత తీసుకోవడం అనుమతించబడదని పేర్కొన్నారు. అలాగే దత్తత తీసుకునే వారి వయస్సు 25 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలని సూచించారు.సీడీపీఓ ఉదయ మాట్లాడుతూ, పిల్లలను దత్తతకు ఇచ్చే ముందు వారి సంరక్షణ, పోషణ, విద్య వంటి అంశాలను బాలల సంరక్షణ కేంద్రాలు సమగ్రంగా పరిశీలిస్తాయని చెప్పారు. కొందరు పిల్లలను తీసుకుని పోషించలేక ఇతరులకు అమ్మే ఘటనలు ఉన్నాయని, అలాంటి వారిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల్లో ఆడపిల్లల్ని అక్రమంగా అమ్మే ఘటనలు ఉన్నాయని, అలాంటి విషయాలను వెంటనే 1098 హెల్ప్‌లైన్ లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. చట్టవిరుద్ధంగా పిల్లల్ని కొనుగోలు చేయడం, అమ్మడం రెండూ నేరాలేనని, జువెనైల్ జస్టిస్ చట్టం సెక్షన్ 80, 81 ప్రకారం మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తారని తెలిపారు.
ఎంపీడీవో బన్సీలాల్ మాట్లాడుతూ, హాస్పిటళ్లలో లేదా దళారుల ద్వారా పిల్లలను అనధికారికంగా దత్తత తీసుకోవడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా బాలల సంరక్షణ కేంద్రాల ద్వారా చట్టబద్ధంగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బన్సీలాల్, సీడీపీఓ ఉదయ, హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాస్, ఏఈఓ జంగయ్య, రజియా సుల్తాన, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, విలేజ్ సెక్రటరీలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.