చేగుంట,జూన్,2,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చేగుంట తహసిల్దార్ బాలలక్ష్మి మువ్వెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం అధికారులందరూ జెండా వందనం సమర్పించి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాల పునాదులపై సిద్ధించిన స్వరాష్ట్రంలో ప్రజలందరికీ సేవ చేయడం గర్వకారణంగా ఉందన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మండల ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందిస్తామని ఆమె స్పష్టం చేశారు.ఈ గర్వకారణమైన వేడుకల్లో చేగుంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) చిన్నారెడ్డి, మండల విద్యాధికారి (ఎంఈఓ) నీరజలతో పాటు తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ ఆవిర్భావ సంబరాలను విజయవంతం చేశారు.