MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 12:44 pm Digital Edition : Medak Today

చేగుంటలో భార్య హత్య, నిందితుడి అరెస్ట్.

  డబ్బుల కోసం భార్యను పరతో కొట్టి హత్య

రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్

చేగుంట, మార్చ్,1 , మెదక్ టుడే న్యూస్:డబ్బుల కోసం భార్యను పరతో కొట్టి హత్య చేసిన కేసును రామాయంపేట్ పోలీసులు దాకచక్యంగా ఛేదించారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్ కేసు వివరాలను వెల్లడించారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం.2015 సంవత్సరంలో మృతురాలు వరలక్ష్మి, నిందితుడు ముఠా త్రిమూర్తులకు రెండో వివాహం జరిగింది. వివాహానంతరం నిందితుడు ఇల్లరికం వచ్చి చేగుంటలో నివాసం ఉంటూ వచ్చాడు. వీరికి దుర్గాప్రసాద్ (10) అనే కుమారుడు ఉన్నాడు.రెండు సంవత్సరాల క్రితం కుటుంబ పోషణ కోసం వరలక్ష్మి కాళ్ళకల్ ఐటిసి కంపెనీలో ఉద్యోగానికి వెళ్లడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నిందితుడు ఎలాంటి పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ భార్యను డబ్బుల కోసం వేధించేవాడు. తరచూ జరిగే గొడవలతో భార్యపై ద్వేషం పెంచుకున్న నిందితుడు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
తేదీ 21.02.2026 అర్ధరాత్రి భార్య, కుమారుడు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న పరతో వరలక్ష్మి తలపై దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం మృతురాలి వద్ద ఉన్న 39.55 గ్రాముల బంగారు పుస్తెలతాడు, రూ.5,000 నగదు, సెల్ ఫోన్ తీసుకుని అన్నవరం పారిపోయాడు.
నమ్మదగిన సమాచారం మేరకు రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం నిఘా ఏర్పాటు చేసి, 01.03.2026 ఉదయం చేగుంట బస్టాండ్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసింది. అతని వద్ద నుంచి బంగారు పుస్తెలతాడు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసును ఛేదించిన రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్, తూప్రాన్ సీఐ రంగకృష్ణ, చేగుంట ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి, ఎస్ఐ భిక్యా నాయక్, కానిస్టేబుళ్లు భాస్కర్, రాజశేఖర్, సాజిద్ అలీ, హోంగార్డ్ రవీందర్‌లను మెదక్ జిల్లా ఎస్పీ గారు అభినందించారు.