చేగుంట,మే,26,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, మెదక్ జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక సేవా నిర్వాహకులు వడియారం గ్రామం మీర్ గియాసుద్దీన్ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. బ్లూ స్టార్ ఈవెంట్స్ సంస్థ దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు అందజేసే “రాష్ట్రీయ దివ్య ప్రతిభా సమ్మాన్ – 2026” అవార్డుకు తెలంగాణ రాష్ట్రం నుండి ఆయనను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. మీర్ గియాసుద్దీన్ సమాజంలో వెనుకబడిన, ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగుల శ్రేయస్సు కోసం అందిస్తున్న “దివ్యాంగ్ సేవ”లను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఆయన నిరంతర అంకితభావం, సమాజంపై ఆయన చూపిన సానుకూల ప్రభావాన్ని అభినందిస్తూ సంస్థ ప్రతినిధులు ఎంపిక లేఖను అందజేశారు. మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తికి ఈ జాతీయ స్థాయి గుర్తింపు దక్కడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు మరియు పలువురు సామాజిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ మీర్ గియాసుద్దీన్కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.