అమీన్ పూర్, ఫిబ్రవరి,01,
(మెదక్ టుడే) న్యూస్: ప్రతినిధి.భక్తికి నిలయమైన బీరంగూడ గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ మహాత్కార్యంలో భాగంగా, ఆర్.సి.పురం మల్లికార్జున నగర్కు చెందిన సాయి భజన మండలి సభ్యులు తమ వంతు సహాయంగా 1,11,116/- (అక్షరాలా లక్షా పదకొండు వేల నూట పదహారు రూపాయలు) విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.ఈ సందర్భంగా సాయి భజన మండలి ప్రతినిధులు మాట్లాడుతూ.. “మన బీరంగూడ గుట్ట పైన అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ఆలయ కమిటీ సభ్యుల కృషి అభినందనీయం. గ్రామస్తులందరి సహకారంతో ఆలయం త్వరగా పూర్తి కావాలని కోరుకుంటున్నాము,” అని తెలిపారు.విరాళాన్ని స్వీకరించిన అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. “స్వామివారి కృపతో ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించాం. నవంబర్ 3న స్థానిక ఎమ్మెల్యే గారు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, మాజీ చైర్మన్లు, కౌన్సిలర్లు మరియు ఎంపీపీల సహకారంతో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆలయ నిర్మాణానికి ఉదారంగా ముందుకు వస్తున్న సాయి భజన మండలి బృందానికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము,” అని పేర్కొన్నారు.ప్రతి ఒక్క భక్తుడు ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని, ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సాయి భజన మండలి సభ్యులు, శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ మెంబర్స్, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బీరంగూడ అయ్యప్ప ఆలయ నిర్మాణానికి సాయి భజన మండలి భారీ విరాళం.
RELATED ARTICLES
