అమీన్పూర్,ఫిబ్రవరి,17,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

మహారుద్రాభిషేకం.. వసంతోత్సవం
ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మహారుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన వసంతోత్సవం కన్నుల పండువగా సాగింది. రంగురంగుల వసంతాలతో స్వామివారిని ఆరాధిస్తూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.అమావాస్యను పురస్కరించుకుని స్వామివారికి విశేషమైన మహా అన్నపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాల నైవేద్యాలను స్వామివారికి సమర్పించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమాలన్నీ ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ గుప్త ప్రత్యక్ష పర్యవేక్షణలో అత్యంత క్రమశిక్షణతో జరిగాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు పూజలు అత్యంత భక్తిభావంతో జరిగాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం, ప్రసాద వితరణలో ఎక్కడా లోటు రాకుండా చర్యలు తీసుకున్నాము.” అని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.ఈ వేడుకల్లో దేవాదాయ శాఖ ధర్మకర్తల మండలి సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు మరియు భక్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.
