MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 3:06 pm Digital Edition : Shiva Kumar

భారతరత్న శ్రీ పి. వి. నరసింహారావు 105వ జయంతి సందర్భంగా ఘన నివాళులు..

హైదరాబాద్,జూన్,28, మెదక్ టుడే న్యూస్(స్టేట్ బ్యూరో)ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లోని పి.వి. ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ స్మారక కార్యక్రమంలో పి.వి. కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేతకు పుష్పాంజలి ఘటించారు.ఈ కార్యక్రమానికి పి.వి. గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టి వై జె ఎఫ్) చాంబర్స్ కమిటీ చైర్మన్, పి.వి. నరసింహారావు కుమారుడు శ్రీ పి.వి. ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై తన తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘన నివాళులర్పించారు. అనంతరం డా. జితేందర్ రావు తనుగుల (తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు), ఎం. హరి బాబు తదితరులతో కలిసి మహానేతకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా పి.వి. ప్రభాకర్ రావు మాట్లాడుతూ, పి.వి. నరసింహారావు మరణించి ఎన్నో సంవత్సరాలు గడిచినా ప్రజల హృదయాల్లో ఆయనకు లభిస్తున్న ఆదరణ, గౌరవం ఏమాత్రం తగ్గలేదని అన్నారు. దేశ ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి భారతదేశ అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేసిన మహానేతగా పి.వి. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. నిజాయితీ, నిస్వార్థ ప్రజాసేవ, దూరదృష్టి, సమర్థ నాయకత్వం వంటి ఆయన విలువలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని, యువత వాటిని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పలువురు వక్తలు పి.వి. నరసింహారావు దేశ ఆర్థిక, విద్యా, విదేశాంగ, పరిపాలనా రంగాల్లో చేసిన విశిష్ట సేవలను కొనియాడారు. ఆధునిక భారత నిర్మాణంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని, దేశాభివృద్ధి పథంలో ఆయన చూపిన మార్గం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో పి.వి. కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, అభిమానులు మహానేతకు మరోసారి ఘనంగా నివాళులర్పించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సంకల్పించారు.