
అమీన్ పూర్, ఆగస్టు,9:(మెదక్ టుడే)న్యూస్,ప్రతినిధి:అమీన్ పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బంధంకొమ్ము గ్రామంలో గ్రామస్తులు మరియు యువకుల ఆధ్వర్యంలో అమ్మవారి బోనాలు మరియు తొట్టెల ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగింది.స్థానిక శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం నుండి ప్రారంభమైన ఈ తొట్టెల ఊరేగింపు మరియు బోనాల వేడుక గ్రామ వీధుల గుండా కోలాహలంగా సాగింది. అమ్మవారికి సమర్పించే బోనాలతో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, ఆటపాటల మధ్య సాగిన ఈ వేడుకల్లో చిన్నవారూ, పెద్దవారూ తేడా లేకుండా ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ పండుగను ఆస్వాదించారు. దీంతో గ్రామం మొత్తం శివనామస్మరణతో మరియు భక్తి పారవశ్యంతో మార్మోగింది.ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు యువకులు మీడియాతో మాట్లాడుతూ తమ అనుభవాలను పంచుకున్నారు.మా తాతల కాలం నుండి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని మేమందరం కలికట్టుగా కొనసాగిస్తున్నాము. మా గ్రామంలో వినాయక చవితి, బతుకమ్మ, దసరా వంటి ప్రతి పండుగను ఏ విధంగానైతే జరుపుకుంటామో, అలాగే ఈ బోనాల ఉత్సవాలను కూడా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. గ్రామ ప్రజలందరిపై భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాముఅని తెలిపారు.గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో అందరిలోనూ ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, ప్రజా ప్రతినిధులు , మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
