MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 2:02 pm Digital Edition : Medak Today

బండ్ల ఊరేగింపు సందర్భంగా పోలీస్ బందోబస్తు పరిశీలన-ఏడుపాయల వన దుర్గామాత జాతరకు భారీగా తరలివస్తున్న భక్తులు.

తొక్కిసలాటలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు

ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి

జాతర ప్రాంతమంతటా నిరంతర నిఘా, కట్టుదిట్టమైన భద్రత

మెదక్ అదనపు ఎస్పీ మహేందర్.

పాపన్నపేట,ఫిబ్రవరి,16 మెదక్ టుడే న్యూస్:  సోమవారం జరుగుతున్న రెండవ రోజు ఏడుపాయల వన దుర్గామాత జాతర సందర్భంగా నిర్వహిస్తున్న బండ్ల ఊరేగింపును పురస్కరించుకొని అదనపు ఎస్పీ శ్రీ మహేందర్ గారు జాతర ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును స్వయంగా పరిశీలించారు. బండ్ల ఊరేగింపు మార్గం, భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు తదితర అంశాలను అదనపు ఎస్పీ గారు క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఏడుపాయల వన దుర్గామాత జాతర రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతుండటంతో, బండ్ల ఊరేగింపును తిలకించేందుకు వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అదనపు ఎస్పీ గారు ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధంగా నియంత్రించడం, పార్కింగ్ ప్రాంతాల్లో సిబ్బందిని నియమించడం, క్యూలైన్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.అలాగే జాతర ప్రాంతమంతటా నిరంతర పోలీస్ నిఘా కొనసాగిస్తూ, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. జాతరను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని అదనపు ఎస్పీ తెలిపారు.