AP, ( స్టేట్ బ్యూరో) నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:
•వేయ్యేళ్ల చారిత్రిక నగరం బెజవాడ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో విజయవాడ(బెజవాడ )రెండోప్రధాన నగరం.ఇది కృష్ణా నది ఒడ్డున ఉంది.ఈ నగరానికి పడమర సరిహద్దుగా ఇంద్రకీలాద్రి పర్వతం,ఉత్తరం సరిహద్దుగా బుడమేరు సరస్సు ఉంది.భౌగోళికంగా తూర్పు కనుమలలో భాగమైన చిన్న కొండలు మధ్య విజయవాడ విస్తరించి ఉంది.ప్రకాశం బ్యారేజి దక్షిణాన బకింహాం కాలువ ఉంది.ఇది ఒకప్పుడు జలరవాణా మార్గంగా విలసిల్లింది.నగరం మధ్యలోంచి మూడు కాలువలు బందరు,ఏలూరు,రైవిస్ కాలువలు ప్రవహిస్తున్నాయి.నదీపరివాహక ప్రాంతం సారవంతమైన నేల కావడంతో ఈ కాలువలు సాగునీరు అందిస్తున్నాయి.వర్షపాతం నైరుతీ,ఈశాన్య రుతుపవనాల నుంచి లభిస్తుంది.ఏడాదిలో ఎక్కువ రోజులు అధిక ఉష్ణోగ్రత ఉంటుంది.నగరానికి పశ్చిమాన కొండపల్లిరిజర్వ్ అడవులు ఉన్నాయి.1871లో బెజవాడ జనాభా 8206, 2011లో 14,91,202 మంది కాగా 2025 లో 2.35 మిలియన్ల గా పెరిగింది.భారతదేశంలో ప్రధాన రైల్వే జంక్షన్ గా మారింది.నేడు విజయవాడ రాష్ట్రానికీ ఆర్ధిక,రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతోంది.విజయవాడకు కనకదుర్గమ్మ (విజయ )నుంచి విజయవాటికగా పేరు వచ్చింది.కాలక్రమేణా విజయవాడ గా మారింది.విజయవాడ అన్న పేరు ఇటీవలే ప్రాచుర్యం చెందింది.పూర్వం నుంచి బెజవాడ అని పిలిచేవారు.యుద్ధమల్లుని శాసనాలలో,కొండవీడు శాసనంలో ఈ ప్రాంతాన్ని బెజవాడగా ప్రస్తావించారు. ఈ రెండు పేర్ల వెనుక పలు కథలు ప్రచారంలో ఉన్నాయి.విపరీతమైన ఎండలు ఈ ప్రాంతంలో ఉండడంతో బ్లేజువాడగా పేరు పొందింది.బ్రిటీష్ వారు రాకముందే బెజవాడ పేరు శాసనాలలో కనిపించడం గమనార్హం.విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి బెజవాడకు బ్లేజువాడగా చమత్కరించడం వల్ల అది ప్రచారంలో వచ్చిందని మరో కధనం.
విజయవాడ ఇంద్రకీలాద్రి పై అర్జునుడు శివుడి కోసం తపస్సు చేసాడు.కిరాతరూపంలోని శివుడితో పోరాడాడని చెప్పే పురాణం కథ ఇది.విజయుడనే అర్జునుడి పేరుమీదే విజయవాడ గా వచ్చింది.పాశుపతాస్త్రం ఇక్కడే అర్జునుడు సాధించాడని పురాణ కథ.స్థల పురాణం వివరించే ఒక శాసనంలో ఈప్రాంతాన్ని వెచ్చవాడగా వ్యవహరించారు.జలమార్గం,భూమార్గం గా ప్రాచీనకాలం నుంచి కీలకమైన వాణిజ్య కూడలిగా ప్రసిద్ధిచెందింది.వెచ్చాలు అధికంగా లభించే చోటు కావడం తో వెచ్చవాడగా ప్రజలు నోళ్లలో నానుడి గా మారింది.అలాగే బీజవాటిక,బీజపురి,బెజ్జం వాడ,చోళరాజేంద్రపురం,అర్జునపురి వంటి పేర్లు కూడా ఉన్నాయి.
ఇక్కడి గుహలు విజయవాడ చరిత్రకు ప్రధాన సూచికలు. విజయవాడ లో హిందువులు 85 శాతం ఉన్నారు.ముస్లింలు వన్ టౌన్ తదితర ప్రాంతంలో 10 శాతం , క్రైస్తవులు 3.6 శాతం,ఇతరులు(జైనులు) 1.4శాతం ఉన్నారు.శిక్కులుఅధికంగా నివసించే ప్రాంతంగా గురునానక్ నగర్ ఏర్పడింది. వాణిజ్య కేంద్రం కావడంతో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ గా ఉంది.అటోనగర్ లో మోటారు వాహనాల విడిభాగాలు,భవన నిర్మాణ సామాగ్రి,దుస్తుల తయారీ జరుగుతోంది.తెలుగు చిత్రనిర్మాణం మద్రాసు, హైదరాబాద్ లలో జరిగినా సినిమా పంపిణి వ్యవస్థ విజయవాడలోనే నెలకొంది. ముద్రణా రంగం అది నుంచి విజయవాడ కేంద్రంగా ఉంది.లక్షలపుస్తకాల ముద్రణ జరిగింది,ఇప్పటికీ జరుగుతున్నది.రాష్ట్రంలోజరిగే ముద్రణలో 90 శాతం ఇక్కడే జరుగుతున్నది.ప్రధాన పత్రికల కార్యాలయాలు,ముద్రణ కేంద్రాలు బెజవాడ లోనే ఉన్నాయి.పురాతనమైన రామ్మోహన గ్రంథాలయం,హనుమంతరావు గ్రంథాలయాలకు ఈ వాడ ప్రసిద్ధి.వెలిదండ్లహనుమంతరావు ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని లాఠీ దెబ్బలకు జైల్లో మరణించారు.ఆయన గుర్తుగా 1934లో ఈ గ్రంథాలయం ప్రారంభించారు.విక్టోరియామ్యూజియంలో పురాతనమైన శిల్పాలు భద్రపరిచారు.బౌద్ధులు,జైనులు,శైవులకు ప్రాచీన కాలం నుంచి బెజవాడ ఆలవాలం.అందుకు సాక్ష్యాలుగా గుహాలయాలు మిగిలాయి.ప్రసార కేంద్రాలుగా ఆకాశవాణి, దూరదర్శన్ లు ఉన్నాయి.నగరంలో 1921లో మారుతీ సినిమా హాలుతో సినిమాల ప్రదర్శన ప్రారంభమైంది.దుర్గకళామందిరం(1923),రామాటాకీసు(1929) ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతానికే చెందిన ఎన్టీఆర్, ఏఎన్నార్ ,సావిత్రి సినీ రంగ దిగ్గజాలు.16,65 జాతీయ రహదారులు నగరంతో అనుసంధానమై ఉన్నాయి.ఇన్నర్ రింగ్ రోడ్డు పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.పాయకాపురం నుంచి రామవరప్పాడు వరకూ రింగ్ రోడ్డు పూర్తిచేయాల్సిఉంది.నగరానికి మెట్రో రైలు కూడా ఇటీవలే మంజూరు అయింది. నగరంలో ప్రధానంగా బందరు,ఏలూరు రహదారులు ఉన్నాయి.బీసెంట్ రోడ్డు నగరం ప్రధానవ్యాపార కూడలి.వన్ టౌన్ సామరంగ్ చౌక్ పరిసరాలు హోల్ సేల్ పచారీ సరుకులు మార్కెట్. విజయవాడ కు 19 కి.మీ దూరంలో గన్నవరంలో విమానాశ్రయం ఉంది.భారత దేశంలోని ప్రధాన నగరాలకు ఇక్కడినుంచి విమాన సౌకర్యం ఉంది.విద్యలకు కూడా విజయవాడ నెలవు.50 ఏళ్ల క్రితం లయోలా,స్టెల్లా,కేబీఎన్,ఎస్ఆర్ ఆర్ కళాశాలలు ప్రధాన విద్యా కేంద్రాలుగా విలసిల్లేవి. ఎన్టీఆర్ ఆరోగ్యవైద్య విశ్వవిద్యాలయం(దేశంలో మొదటి ఆరోగ్యవైద్య వర్సిటీ) విజయవాడ లో నెలకొంది.ప్రభుత్వ ఆస్పత్రితోపాటు పలు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి. 1940లనుంచి విజయవాడ కమ్యూనిస్టుల కోటగా ఉంది.కార్పొరేషన్ మొదటిమేయర్ పదవి కమ్యూనిస్టులకే దక్కింది.గన్నవరంలో ఐటీ పార్క్ , ఎస్ఈజడ్ ఏర్పాటు కానుంది.మరో ఐటీ పార్క్ మంగళగిరిలో ఏర్పాటు కానుంది.నగరంలో నాలుగు సీవేజ్ (మురికినీటి శుద్ధి) ప్లాంట్లు ఉన్నాయి. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ విజయవాడ వాసి.ప్రముఖ శిల్పి కృష్ణారావు (ఉండవల్లి అనంతస్వామి విగ్రహం సరి చేసినవాడు), స్థానికులే.మల్లయోధులు మహమ్మద్ గాలీబ్,సయ్యద్ అప్పలస్వామి ఇక్కడి వారే.జైనమతాచార్యుడు కాళీ భద్రాచార్యుడు,శైవమతాచార్యులు శ్రీపతి పండితారాధ్యులు విజయవాడ వారే.రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు అయ్యదేవర కాళేశ్వరరావు,మరుపిళ్లచిట్టి,కాట్రగడ్డ మధుసూదనరావు,గులాం మొహిద్దీన్, బాలసుబ్రహ్మణ్యం గుప్తా ,రాంపిళ్ల నరసాయమ్మ ప్రముఖులు. ప్రముఖ నాస్తిక కేంద్రం స్థాపకుడు గోపరాజు రామచంద్రరావు(గోరా) ఇక్కడి వారే.డా.సమరం,లవణం,సమరం ఆయన కుమారులే.7 కి.మీ మేర సూపర్ స్ట్రక్చర్ వంతెన నిర్మించి బైపాస్ కు అనుసంధానం చేయనున్నారు.నగరం 61.88 కి.మీ మేర విస్తరించి ఉంది.రెండవ అతి పెద్ద నగరం.జన సాంద్రత కి.మీ 16.939 మందిగా ఉంది.సాంస్కృతిక కార్యక్రమాలు తుమ్మలపల్లి కళాక్షేత్రం, సిద్ధార్ధ అకాడమి కేంద్రంగా జరుగుతున్నాయి.అతి పెద్ద పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి జిల్లా, రాష్ట్ర, అంతరాష్ట్ర బస్సులు తిరుగుతాయి.నగరంలో 400 వరకూ సిటీ బస్సులు తిరుగుతాయి.రాష్ట్రలారీరవాణా అసోసియేషన్ కు విజయవాడ ప్రధాన కేంద్రం.
చారిత్రిక నేపధ్యం
3 నుంచి 7 లో శతాబ్దం వరకూ పాలించిన విష్ణుకుండినులకు బెజవాడ రాజధానిగా విలసిల్లింది. రాజు మాధవవర్మ కుమారుడు రథ చక్రం క్రింద బీద బాలుడ్ని చంపడంతో రాజు తన కుమారుడినీ అలాగే చంపాలని అజ్జాపించాడు.మల్లేశ్వరాలయంలోని విష్ణువర్ధనుడి శాసనం,మరో కాల్యమబోయ శాసనం,విజయనగరం జమిందారులచరిత్ర,చాటువులు ఈ సంఘటనను పేర్కొంటున్నాయి. అక్కన్న,మాదన్న గుహలు,మొగల్రా జపురం గుహలు మూడు, నాలుగు శతాబ్దాలకు చెందినవి.ఒకప్పుడు ఇవి బౌద్ధరామాలని తరువాత శైవులు స్వాధీనంలోకి వెళ్లాయని చారిత్రికుల అభిప్రాయం. వీటిని విజయవాడను పాలించిన శాలంకాయనులు,పల్లవులు నిర్మించారని మరో కధనం.8వశతాబ్దంలో చైనా యాత్రికుడు హు ఆన్ చ్వాంగ్ విజయవాడను సందర్శించాడని,ఆయన ఈ ప్రాంతం తెనకచక (ధాన్యకటకం)రాజ్యంలో భాగంగా పేర్కొన్నారు.సీతానగరం,ఉండవల్లి కొండలగుహల్లోబౌద్ధభిక్షవులు దీపాలు వెలిగించే వారిని,కాంతిలో బెజవాడ వెలిగిపోతున్నదని రాసాడు.ఇక్కడ ఔషధ కొండ ఉండేదని,ఈపర్వత సానువుల్లో సంచరించేసాధువులకు బంగారం తయారు చేసే హేమ విద్య తెలుసని రాసాడు. కృష్ణా నది లోకానికి ఉపకారం చేసే అనేక ఔషధల్ని,బీజాల్ని ప్రవాహంతో ఈ ప్రాంతంలో పడేయడం తో దీనికి బీజపురిగా పేరు ఉంది.ఆ బీజాలు మొలకెత్తి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసాయంటారు.శాతవాహనుల కాలం నుంచి విజయవాడ పేరు శాసనాలలో కనిపిస్తుంది.
8-10 శతాబ్దాల మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన వేంగి చాళుక్యుల పై రాష్ట్రకూటులు పలుమార్లు దండయాత్రలు చేసేవారు.ఈయుద్ధాల్లో నగరం పలుమార్లు చేతులు మారింది. యుద్ధమల్లుడు రాష్ట్ర కూటులతో సంధి చేసుకుని మళ్లీ విజయవాడను సొంతం చేసుకున్నాడు.ఆ తర్వాత చోళులకు,చాళుక్యులకు 70సంవత్సరాలపాటు సాగినయుద్ధంలో ఇక్కడ శాంతిభద్రతలు కరువైనాయి.సా.శ 999లో రాజరాజ చోళుడు చాళిక్యులపై విజయంతో విజయవాడను స్వాధీనం చేసుకున్నాడు.దాంతో వేంగి చాళిక్యులు తమ రాజధాని బెజవాడ నుంచి రాజమహేంద్రవరానికి మార్చారు.
11-18 శతాబ్దాల నుంచి రాజధాని కాకపోవడంతో రాజకీయ ప్రాధాన్యత కోల్పోయింది.వాణిజ్య కేంద్రంగా మారింది.11 వశతాబ్దినాటి 47శాసనాలు ఈ ప్రాంతంలో లభించాయి.ఇతర తవ్వకాల వల్ల వేయ్యేళ్ల క్రితంఇక్కడ మహానగరం ఉండేదని చరిత్ర కారులుచెబుతున్నారు.కృష్ణానదిలోఓడిసా, మధ్యప్రదేశ్,కర్ణాటకకు జలమార్గం ఉండేది.దక్షిణాపద భూమార్గాలకు కూడలిగా ఉండేది.కాకతీయులు,రెడ్డిరాజులు,గజపతులు విజయవాడను వ్యాపార కేంద్రంగానే అభివృద్ధి చేసారు.15వశతాబ్దిలో పూసపాటి రాజులు పాలించారు.గజపతులపై యుద్ధానికి వెళుతూ శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ విడిది చేసాడు. సమీపంలోని శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ను సందర్శించారు.స్వామి ఆదేశంతోనే ఆయన ఆముక్తమాల్యద కావ్యరచనకు పూనుకున్నారని అవతారికలో రాసాడు.16వశతాబ్ది తరువాత అటు రాజకీయ,వాణిజ్య ప్రాముఖ్యత ను కోల్పోయి చిన్న ప్రాంతానికి పరిమితం అయింది.ఈస్టిండియా కంపెనీ కాలంలో1832లోతీవ్రకరువు సంభవించింది.అప్పుడు ఆర్ధర్ కాటన్ కృష్ణానదిపై ఆనకట్ట నిర్మించి నీటిని నిల్వ చేసి సేద్యానికి ఉపయోగించాలని నివేదిక ఇచ్చాడు.ఈప్రాంతం పరిశీలించి విజయవాడ ఆనకట్టకు అనువైనదని ఎంపిక చేసాడు.19వదశకంలో ఆనకట్ట నిర్మాణం తో మళ్లీ బెజవాడకు ప్రాముఖ్యత పెరిగింది.1888లో మున్సిపాలిటీ,1981లో కార్పోరేషన్ అయింది.1940 వరకూ వన్ టౌన్ ప్రాంతం అడవి,కొండలుగా ఉండేది.1947తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంతో అక్కడి ప్రజలు వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.49 నాటికి అకస్మాత్తుగా జనసాంద్రత వన్ టౌన్ లో పెరిగింది.1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుతో రాజధానిగా విజయవాడను చేయాలని ప్రతిపాదన ఒక్క ఓటుతో వీగి కర్నూలు అయింది.తెలంగాణ విలీనం తో 1956 లో హైదరాబాద్ రాజధాని అయింది.మొదటి నుంచి ఓడరేవు గా మచిలీపట్నానికి ఉన్న ప్రాముఖ్యత బెజవాడకు రాలేదు.తెలంగాణ విభజనతో విజయవాడ,గుంటూరు మధ్య ప్రాంతం అమరావతి గా రాజధాని అయింది.కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాకు రాజధానిగా విజయవాడ మారింది.పర్యాటక ప్రదేశాలలో కనకదుర్గ గుడి
గాంధీ కొండ,ఉండవల్లి,మొగల్ రాజగోపురం గుహలు,హజ్రత్ బాల్ మసీదు,గుణదల మేరీ మాత కొండ, బట్టర్ ఫ్లై పార్క్, ప్రకాశం బ్యారేజి,భవానీ ద్వీపం,కొండపల్లి ఖిల్లా తదితరాలు ఉన్నాయి.ఏదిఏమైనా విజయవాడ నగరానికి చారిత్రిక,రాజకీయ, సాంస్కృతిక నేపధ్యం ఉంది.నవ్వ ఆంధ్ర ప్రదేశ్ కు అమరావతి రాజధాని అయినా ముఖద్వారం విజయవాడ కావడం దానికున్న ప్రాశస్త్యం మారదు.