MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 1:23 am Digital Edition : Shiva Kumar

అమీన్‌పూర్‌లో హైడ్రా అధికారుల తీరుపై నిరసన:న్యాయవాది కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. సీఐకి ఫిర్యాదు.

అమీన్‌పూర్,మే,29,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని ఐలాపూర్‌లో హైడ్రా అధికారుల చర్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కూల్చివేతకు గురైన గెస్ట్ హౌజ్ స్థలంలో అధికారులు ఫెన్సింగ్ పనులు చేపడుతుండగా, స్థానిక న్యాయవాది ముఖీం ప్రతినిధులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో మహిళా సిబ్బంది పట్ల అధికారులు అనుచితంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.పద్మ ఆరోపణలు: “మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు”ఈ ఘటనపై ఘటనా స్థలంలో ఉన్న పద్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, “మా యజమాని (న్యాయవాది ముఖీం) న్యాయపరంగా కోర్టు ఆదేశాలు తీసుకొచ్చారు. అలాంటప్పుడు మా అనుమతి లేకుండా, మమ్మల్ని సంప్రదించకుండా ఎలా లోపలికి వస్తారు? మేము ‘సార్ వచ్చే వరకు ఆగండి’ అని బ్రతిమలాడినా వినిపించుకోలేదు. ఫోన్‌లో రికార్డ్ చేస్తున్న నన్ను అడ్డుకుంటూ, మహిళ అని కూడా చూడకుండా నా చేయి పట్టుకుని గుంజారు, అసభ్యకరంగా ప్రవర్తించారు. మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసేలా అధికారుల తీరు ఉంది,” అని కన్నీటి పర్యంతమయ్యారు.పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు:ఈ ఘటనపై పద్మ వెంటనేఅమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి హైడ్రా అధికారులపై ఫిర్యాదు చేశారు. అమీన్‌పూర్ సీఐ నరేష్‌ను కలిసి జరిగిన సంఘటనను వివరించారు. తనను వేధించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.సీఐ నరేష్ స్పందన:బాధితురాలు పద్మ ఫిర్యాదును స్వీకరించిన సీఐ నరేష్, విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. హైడ్రా అధికారుల తీరుపై వచ్చిన ఆరోపణలను నమోదు చేసుకున్నామని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ సంఘటనతో ఐలాపూర్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అధికారులు ఒక వైపు చట్టాన్ని అమలు చేస్తున్నామంటూనే, మరోవైపు సామాన్యుల పట్ల అమానుషంగా ప్రవర్తించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.