MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 1:25 am Digital Edition : Shiva Kumar

అభివృద్ధిలో అమీన్‌పూర్, బీరంగూడలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

అమీన్‌పూర్,మే,20,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్, బీరంగూడ డివిజన్ల పరిధిలోని ప్రతి కాలనీని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, అమీన్‌పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్ డివిజన్, బీరంగూడ డివిజన్ పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు.ఈ పర్యటనలో భాగంగా తులసివనం కాలనీ, భ్రమరాంబిక నగర్, ఏఆర్ బృందావన్, కెఎస్ఆర్ కాలనీ, అంజనాద్రి కాలనీ, టైలర్ కాలనీ, ఎన్ఎస్ఎల్ కాలనీ, ఎన్బీఆర్ కాలనీ, ఇక్రిశాట్ కాలనీలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. నేరుగా ప్రజలు, ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో సమావేశమై క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సీసీ రోడ్లు, యూజిడీలు, విద్యుత్, తాగునీరు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల సమస్యలపై సమగ్ర నివేదికను తనకు అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నివేదికల ఆధారంగా నిధులు కేటాయించి, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు.తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: అమీన్‌పూర్ పరిధిలో దశాబ్దాలుగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించి, ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నామని, నూతన కాలనీలకు సైతం నీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు.
ప్రభుత్వ స్థలాల రక్షణ: కాలనీలలోని ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జాకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
మెరుగైన పారిశుద్ధ్యం: పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా నూతన సిబ్బందిని నియమిస్తున్నట్లు వెల్లడించారు.
విద్యుత్ వ్యవస్థ బలోపేతం: నూతన కాలనీల ఏర్పాటుతో పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సబ్‌స్టేషన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడటం తన నైజమని, మిగతా సమయమంతా ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే జిఎంఆర్ స్పష్టం చేశారు. అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరిస్తూ, అవసరమైన నిధులు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అతి త్వరలోనే బీరంగూడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. తమ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే స్వయంగా కాలనీలకు రావడం పట్ల స్థానిక ప్రజలు, అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు,కృష్ణ, బాలరాజు,యూనుస్, ఇంజనీరింగ్ విభాగం ఈఈ సురేష్, డిఈ వెంకటరమణ, జలమండలి డిజిఎం శివకుమార్, విద్యుత్ శాఖ ఏడి సంజీవ్ మరియు ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.