అభివృద్ధి కీ దాతలే .. పెద్ద దిక్కు .!
పాపన్నపేట,ఫిబ్రవరి,14,మెదక్ టుడే న్యూస్:రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7 న ఏర్పడి ఇటీవలే రెండు సంవత్సరాలు పూర్తి అయింది. మెదక్ జిల్లా ఏడుపాయలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు 2024 డిసెంబర్ 25 న విచ్చేసి వనదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ ప్రాంత అభివృద్ధికీ నిధులు కేటాయిస్తారని భక్తులు ఆశించిన అలాంటి ప్రకటన అప్పట్లో రాలేదు. భక్తుల ఆదాయంపై దృష్టి పెట్టారు కానీ,అభివృద్ధిపై లేదని,దేవాదాయ,ధర్మదాయ శాఖ,ప్రభుత్వం శాశ్వత నిర్మాణాలను చేపట్టడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దాతలే ప్రసాద విక్రయ కేంద్రం, వాహన పూజ షెడ్డు,అద్దె గదులు ఇలా వివిధ రూపాలలో సహాయం అందిస్తూ ఏడుపాయల అభివృద్ధి కీ పెద్ద దిక్కుగా మారారు. జాతరకు ముందే అధికారులు ఏర్పాట్ల పనుల కార్యచరణ ప్రకటిస్తారు. ఇటీవలే రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 35 కోట్లు మంజూరు కాగా పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు.ఈ ప్రాంత అభివృద్ధికీ స్థానిక మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ప్రభుత్వ సహకారంతో నిధులను సకాలంలో అందిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.