పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు
చేగుంట,మే,7,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ రఫీ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లా పాండ్రంగి (జూలై 4, 1897). జన్మించారు. ఆయన గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అగ్గిపిడుగులా పోరాడిన గొప్ప దేశభక్తుడు అల్లూరి అని కొనియాడారు. కేవలం 25 ఏళ్ల చిన్న వయసులోనే వేలాది మంది గిరిజనులను ఏకం చేసి, విల్లులు, బాణాలు, నాటు తుపాకులతో బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ వారి వెన్నులో వణుకు పుట్టించారని గుర్తు చేశారు. 1924 మే 7న బ్రిటిష్ వారు ఆయన్ను మోసపూరితంగా పట్టుకుని కాల్చి చంపిన రోజని, అందుకే ఏటా ఈ రోజున ఆయన బలిదానాన్ని స్మరించుకుంటామని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ సైతం అల్లూరి సేవలను గుర్తించి భీమవరంలో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఉపసర్పంచ్ మొహమ్మద్ రఫీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సండ్రుగు సతీష్, గ్రామ పాలకవర్గ సభ్యులు సాయిబాబా, సుఖేందర్, రవి, గ్రామస్తులు లింగం, శ్రీను, సోమ సత్యనారాయణ, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
