మెదక్,కొల్చారం,ఫిబ్రవరి,18,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.మెదక్ పట్టణానికి చెందిన వీవీ సిల్క్స్ యజమాని, బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు వనపర్తి రోహిత్ గుప్తా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.అతివేగంగా వస్తున్న కారు చెట్టును ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున కొల్చారం శివారులో హైదరాబాద్ ప్రధాన రహదారి పై జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, కొల్చారం పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ పట్టణానికి చెందిన వీవీ సిల్క్స్ యజమాని, బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు వనపర్తి రోహిత్ గుప్తా, తన స్నేహితుడు కామారెడ్డి జిల్లాకు చెందిన విజయ్ తో కలిసి విజయవాడలో జరిగిన బీసీవై పార్టీ బీసీ సింహగర్జన కార్యక్రమానికి హాజరై తిరిగి మెదక్ కు వస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ నడుపుతున్న కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొట్టి పక్కనే ఉన్న కట్ చేసిన చెట్టు మొదలు పై నుండి కిందికి వెళ్ళింది. ఈ సంఘటనలో రోహిత్ గుప్త అక్కడికక్కడే మృతి చెందగా విజయ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రున్ని 108 సహాయంతో మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

