- భద్రత కట్టుదిట్టం
న్యూఢిల్లీ, నవంబర్ 10 :
బీహార్లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి దశలో 121 స్థానాల్లో ఓటింగ్ జరగగా, మిగిలిన 122 స్థానాలకు మంగళవారం రెండో దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ దశలో మొత్తం 1302 మంది అభ్యర్థులు ప్రజాభిప్రాయ పరీక్షకు హాజరవుతున్న దాదాపు నాలుగు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. రెండో దశలో పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామఢి, మధుబని, సుపౌల్, అరేరియా, కిషన్గంజ్ వంటి జిల్లాల్లో ఓటింగ్ జరగనుంది. పోలింగ్ నేపథ్యంలో అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మొత్తం నాలుగు లక్షల మంది పోలీసు సిబ్బంది, కేంద్ర భద్రతాబలగాలను నియమించారు. అవసరమైన సామగ్రితో ఎన్నికల సిబ్బంది ఇప్పటికే సంబంధిత బూత్లకు చేరుకున్నారు. ఈ దశలోనూ నితీశ్ కుమార్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, ప్రముఖ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్రంలో ప్రధాన పోటీ మహాగఠ్బంధన్, ఎన్డీయే కూటముల మధ్యనే నెలకొంది. దీనితో పాటు కొత్తగా ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ నాయకత్వంలోని జనశక్తి జనతాదళ్ పార్టీలు కూడా బరిలో నిలిచాయి. రెండో దశ ఫలితాల ప్రభావం రాష్ట్ర రాజకీయాల దిశను నిర్ణయించే అవకాశముండటంతో అన్ని పార్టీల దృష్టి ఈ దశ పోలింగ్పై కేంద్రీకృతమైంది.